బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘటనలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ ముట్టడికి యత్నించారు. దీంతో యూనివర్సిటీ మెయిన్ గేటు దగ్గర పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అయినా, క్యాంపస్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ పోలీసులు రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు మెడిసెమ్మ రాజు పాల్గొన్నారు.