దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్​..3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి

దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్​..3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి
  • ఇంటెలిజెన్స్​ వ్యవస్థ, టెక్నాలజీతో మావోయిస్టుల కదలికపై నిఘా
  • తాజా ఎన్​కౌంటర్​లో 15 మంది మహిళలు మృతి
  • మొత్తం 29 డెడ్​బాడీలను బయటకుతెచ్చిన పోలీసులు 
  • 30కి పైగా ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దండకారణ్యంలో బస్తర్​ బలగాలు పక్కా ప్లాన్​తో ముందుకెళ్తున్నాయి. గూగుల్ ​మ్యాప్​కు కూడా దొరకని అబూజ్​మఢ్​లో ఇంటెలిజెన్స్​ వ్యవస్థ,  టెక్నాలజీ సాయంతో మావోయిస్టుల ప్రతి కదలికపైనా నిఘా పెట్టాయి. మూడు నెలల్లో 71 మంది నక్సల్స్ ను ఎన్​కౌంటర్​ చేశాయి. దండకారణ్యంలోని అబూజ్​మఢ్  మావోయిస్టులకు కంచుకోట. మంగళవారం పోలీసులు 29 మంది మావోయిస్టులను ఎన్​కౌంటర్​ చేసిన కాంకేర్​జిల్లాలోని చోటేబైఠియా ప్రాంతం కూడా అబూజ్​మఢ్​లోనే ఉంది.

ఈ ప్రాంతంలో బస్తర్ బలగాలు పాగా వేయడం వెనుక భద్రతా బలగాల సుదీర్ఘ  శ్రమ దాగి ఉంది. ఇక్కడ ఆదివాసీలు మొత్తం మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులే. అందుకే భద్రతా బలగాలు అడుగుపెడితే క్షణాల్లో వాళ్లకు సమాచారం తెలిసిపోతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 2014–-17 మధ్య కాలంలో ఆ ప్రాంతంలోకి సీఆర్​పీఎఫ్, స్పెషల్​ టాస్క్​ఫోర్స్ (ఎస్​టీఎఫ్)​, డిస్ట్రిక్ట్​ రిజర్వుడ్​గార్డ్స్ (డీఆర్​జీ)  బలగాలు భారీగా చొచ్చుకుపోయాయి. మారుమూల పల్లెల్లో రోడ్లు నిర్మించడం, సెల్​టవర్లు ఏర్పాటు చేయడం, యువతను ఆకర్షించడం లాంటి కార్యక్రమాల్లో సక్సెస్​ అయ్యాయి.

మినీ థియేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం, సంక్షేమం అందించడంతో పాటు అక్కడి ప్రజలను బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా ఇంటెలిజెన్స్​వ్యవస్థను పటిష్టం చేసి బస్తర్​పై ఆధిపత్యం సాధించాయి. దీంతో ఇప్పుడు అక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే భద్రతా బలగాలకు తెలుస్తోంది.  కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉండే ఐదు ఏరియా కమిటీల్లోని 250 మంది సాయుధ మావోయిస్టుల సమాచారం మొత్తం భద్రతా బలగాల గుప్పెట్లోకి వెళ్లింది. ఇందులో భాగంగానే కాంకేర్​ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

దీనికి తోడు కేంద్ర హోంశాఖ కొంతకాలంగా చత్తీస్​గఢ్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఈ క్రమంలో బలగాలకు  స్పెషల్​ట్రైనింగ్​ ఇప్పించింది. వానాకాలంలో కూంబింగ్, గుట్టల్లో దాడులు చేయడంపై సీఆర్​పీఎఫ్​ బలగాలకు శిక్షణ ఇచ్చారు. బస్తర్​ ఫైటర్స్ పేరుతో మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. సెల్​టవర్ల సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టు లీడర్ల ఆచూకీ కనిపెడుతున్నారు. దీనివల్లే బస్తర్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో మెరుపుదాడి

ఈ నెల 5న కాంకేర్​ జిల్లా చోటేబైఠియా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ సమాచారం గ్రిడ్​ లొకేషన్​ను బస్తర్​ ఐజీకి పంపించారు. స్థానికంగా ఉన్న తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పక్కా వివరాలు సేకరించారు. ఎన్నికల వేళ మావోయిస్టులు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుసుకున్నారు. కాంకేర్​ ఎస్పీ ఐకే ఎలిసేలా నేతృత్వంలో బీఎస్ఎఫ్, డీఆర్ జీ బలగాలను రంగంలోకి దించారు. సోమవారం రాత్రి నుంచే  వీరి వేట మొదలైంది.

మంగళవారం చోటేబైఠియా పోలీస్ స్టేషన్​ పరిధిలోని బినాగుండా-కోరేనార్​ అడవుల్లో మావోయిస్టులు మకాం వేసిన ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో అదను చూసి బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగాయి. ఎన్​కౌంటర్ల స్పెషలిస్టు సీఐ లక్షణ్​ కేత్​ ఆధ్వర్యంలో బలగాలు చుట్టుముట్టి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. తేరుకునే లోపే మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన వారు పోలీసులను నిలువరించేందుకు 4 గంటల పాటు పోరాడారు. ఎన్నోసార్లు ఎన్​కౌంటర్ల నుంచి తప్పించుకున్న కమాండర్​ శంకర్​రావు ఈసారి భద్రతా బలగాల వలకు చిక్కారు. 

తొమ్మిది మృతదేహాల గుర్తింపు:  సుందర్​రాజ్, బస్తర్ ఐజీ

ఎన్​కౌంటర్​లో మృతిచెందిన తొమ్మిది మావోయిస్టుల డెడ్​బాడీలను గుర్తించినట్లు బస్తర్ ఐజీ సుందర్​రాజ్​ పీ తెలిపారు. డీఐజీ కెల్​ ధ్రువ్, కాంకేర్​ ఎస్పీ ఐకే ఎలిసేలాతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్​కౌంటర్​జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల డెడ్​బాడీలను బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు. చనిపోయిన మావోయిస్టులలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు.

అందులో దళ కమాండర్ శంకర్​రావు, అతని భార్య రజిత, జనతన సర్కారు సమన్వయ కర్త లలిత, ఉత్తర బస్తర్​దళ సభ్యురాలు మాధవి, పరతాపూర్​ ఏరియా కమిటీ సభ్యులు జుగనీ అలియాస్​ మాలతి, సుఖ్ లాల్, శ్రీకాంత్, ఎల్​ఓఎస్​ కమాండర్ రూపీ మెడ్కీ, ఉత్తర  బస్తర్ కమిటీ సభ్యురాలు రంశీలాను గుర్తించామని తెలిపారు. అలాగే, ఘటనా స్థలంలో ఏకే-47, ఇన్సాస్, 303, ఎస్​ఎల్ఆర్ తదితర 30కి పైగా ఆయుధాలతో పాటు వాకీటాకీలు, రాకెట్​లాంఛర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అవన్నీ బేస్​ క్యాంపులు, పోలీసులపై దాడి చేసి మావోయిస్టులు లూటీ చేసిన ఆయుధాలేనని ఆయన తెలిపారు. కాగా, 2023లో జరిగిన 70 ఎన్​కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు చనిపోయారని, ఈ ఏడాది ఇప్పటివరకు 79 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని ఐజీ వెల్లడించారు. అలాగే, జనవరి నుంచి 394 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.