
- బీసీ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు చాలా ధైర్యవంతులుగా ఉంటారని, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న చాలామంది ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారేనని చెప్పారు. హైదరాబాద్ లో శనివారం బీసీటీఏ ఆధ్వర్యంలో సర్కారు బడుల్లో చదివి మంచి మార్కులు సాధించిన 180 మంది టెన్త్ విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో కలిసి ఆర్.కృష్ణయ్య చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
ఏమైనా సాధించాలంటే కష్టపడి చదవాలని, పేదరికం చదువుకు అడ్డంకి కాదని చెప్పారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. విద్యార్థులను భావి భారత పౌరులగా తీర్చిదిద్దడంలో టీచర్లదే కీలక భూమిక అని అన్నారు. అలాంటి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, జాక్టో చైర్మన్ సదానందంగౌడ్, ట్రెజరర్ హేమచంద్రుడు, బీసీటీఏ నేతలు సంతోష్ కుమార్, లక్ష్మీకాంతరావు, రాఘవేందర్, సుబ్బారావు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి స్కూల్ టాపర్ తో పాటు హెడ్మాసర్ నూ సన్మానించారు.