బీసీలను మోసం చేసేందుకే జీవో 46 : చైర్మన్ జాజుల

బీసీలను మోసం చేసేందుకే జీవో 46 :  చైర్మన్ జాజుల
  • కాంగ్రెస్​పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన  జీవో 46 బీసీలను మోసం చేయడమేనని బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్ గౌడ్  అన్నారు. ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్నా.. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవో నంబర్ 9 విడుదల చేసింది. 

ఇప్పుడు దానిని రద్దు చేసి 46 జీవో తెచ్చింది. ఇది రాజకీయంగా బీసీలను అణచివేసే కుట్ర” అని శ్రీనివాస్​గౌడ్​ విమర్శించారు. రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది రెడ్లను సర్పంచులుగా చేసేందుకే జీవో నంబర్ 46 ఉపయోగపడుతుందని, ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. జీవో 46 ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్  చేశారు. జీవో 46లను వ్యతిరేకిస్తూ  ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జీవో ప్రతులను దహనం చేస్తామని ఆయన వెల్లడించారు.