విద్యుత్ శాఖలో బీసీ రిజర్వేషన్లు అమలు కావట్లే : ఉద్యోగ సంఘాలు

విద్యుత్ శాఖలో  బీసీ రిజర్వేషన్లు అమలు కావట్లే : ఉద్యోగ సంఘాలు
  •     బీసీ కమిషన్‌కు ఉద్యోగ సంఘాల ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లలో బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఉద్యోగ సంఘాలు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ అంశంపై ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో శనివారం చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు సమావేశమై చర్చించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులను పిలిచి కమిషన్ వివరణ కోరింది. 

అయితే, మరోసారి ఉద్యోగ సంఘాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ అంశాన్ని కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. మార్చి 4న స్వయంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ కార్యాలయాలను సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని నిర్ణయించామని చైర్మన్ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.