
- ప్రభుత్వం తొందరపడొద్దు: జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తొందరపడి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సోమవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండానే వారంపది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తే చేతులు కాల్చుకోక తప్పదని జాజుల హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లుపై ఇంకో 3 వారాల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు మేధావులు, నిపుణులు, అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి చిరంజీవులు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుందారం గణేశ్ చారి, శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.