T20 World Cup 2026: గిల్‌పై వేటు.. కిషాన్‌కు బంపర్ ఛాన్స్: వరల్డ్ కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ

T20 World Cup 2026: గిల్‌పై వేటు.. కిషాన్‌కు బంపర్ ఛాన్స్: వరల్డ్ కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ

టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అందుబాటులో ఉన్న బలమైన భారత స్క్వాడ్ ను ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఫామ్ లో లేని గిల్ పై వేటు వేసి అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. మరోవైపు సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపికైన జితేష్ శర్మకు సెలక్టర్లు షాక్ ఇచ్చారు.   
 
ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్ రూపంలో మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, శివమ్ దూబే జట్టులో కొనసాగనున్నారు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ తొలిసారి ఐసీసీ ఈవెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో వేటు పడిన రింకూ వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి వచ్చాడు.

ALSO READ | ఆసియా కప్ .. డిసెంబర్ 21న పాకిస్తాన్ తో ఇండియా టైటిల్ ఫైట్

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి.

అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.

వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా