Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. కొత్త భద్రతా ప్రోటోకాల్‌లను ప్రకటించిన బీసీసీఐ

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. కొత్త భద్రతా ప్రోటోకాల్‌లను ప్రకటించిన బీసీసీఐ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  తొక్కిసలాటలో భాగంగా 11 మంది మరణించగా.. 50 మందికి పైగా  గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా  బీసీసీఐ కఠినమైన చర్యలను ప్రకటించింది. ఇకపై, బలమైన భద్రతా ప్రోటోకాల్‌లు లేకుండా ఐపీఎల్ విజయోత్సవ వేడుకలు నిర్వహించడానికి వీలు లేదని తెలిపింది. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషాద సంఘటనపై విచారం చేస్తూ ఐపీఎల్ విజయాల తర్వాత వేడుకలు ఎప్పుడూ మానవ ప్రాణాలను బలిగొనకూడదని ఆయన చెప్పారు.

కొత్త భద్రతా నియమాల ప్రకారం:

-ఐపీఎల్ టైటిల్ గెలిచిన 3 నుండి 4 రోజులలోపు ఏ జట్టు కూడా ఎటువంటి బహిరంగ వేడుకలు లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించబడదు. 

-ఏదైనా ప్రజా కార్యక్రమాన్ని నిర్ధారించే ముందు బృందాలు స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు   పొందాలి. అనుమతులు లేకుండా ఏ వేడుక కూడా కొనసాగకూడదని బోర్డు నొక్కి చెప్పింది.

-ఏదైనా వేడుకను నిర్వహించడానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు BCCI నుండి వ్రాతపూర్వక అనుమతి పొందాలి

-జట్లు అన్ని వేదికల వద్ద ఆటగాళ్ల రవాణా సమయంలో భారీ భద్రతను ఏర్పాటు చేయాలి. విమానాశ్రయం నుండి ఈవెంట్ వేదిక వరకు కవరేజ్ విస్తరించి ఉంటుంది.

-కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కొత్త క్రౌడ్ మేనేజ్‌మెంట్ బిల్లును ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈవెంట్ మేనేజర్‌లను బాధ్యులుగా చేసి జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

అసలు చిన్న స్వామి స్టేడియం దగ్గర ఏం జరిగిందంటే..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్గా విజేతగా నిలిచింది. బుధవారం ఉదయం అహ్మదాబాద్ నుంచి జట్టు సభ్యులంతా బెంగళూరుకు చేరుకున్నారు. వీరికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లి సీఎం సిద్ధరామయ్యను కలిశారు. సభ్యులందరినీ ఆయన సన్మానించారు. అసెంబ్లీ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్​ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ.. భద్రతా కారణాల రీత్యా విక్టరీ పరేడ్​ను రద్దు చేసుకున్నారు.

►ALSO READ | ENG vs IND 2025: ఐదు కాదు తొమ్మిది వికెట్లు తీసిన బుమ్రాకు అభినందనలు: సచిన్ టెండూల్కర్

అసెంబ్లీ నుంచి ఆర్సీబీ జట్టు చిన్న స్వామి స్టేడియంకు బయల్దేరింది. బస్సు వెంట వేలాది అభిమానులు పరుగులు తీశారు. జట్టు సభ్యులంతా స్టేడియం లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేడియం మొత్తం నిండిపోయి ఉంది. ఇంకా వేలాది మంది అభిమానులు బయటే ఉన్నారు. 3వ నంబర్ గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని బౌరింగ్ హాస్పిటల్, విట్టల్ మాల్యా రోడ్లోని వైదేహి ఆస్పత్రికి తరలించారు.