ముషీరాబాద్, వెలుగు: స్కాలర్ షిప్ లు ఇవ్వక, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది బీసీ స్టూడెంట్లను చదువుకు దూరం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య, వైద్యరంగాలను జాతీయం చేస్తామని చెప్పిన గొప్పలు ఆచరణలో ఎక్కడ అని ప్రశ్నించారు.
బీసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పాలమూరు నుంచి పట్నం వరకు చేపట్టిన బీసీల పోరుయాత్ర శుక్రవారం నారాయణగూడ, హిమాయత్నగర్, రాంనగర్, వారాసిగూడ, సికింద్రాబాద్ లలో కొనసాగింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ చార్జీలను పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం పెంచడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, మహేశ్యాదవ్, సదానందం,రాజు పాల్గొన్నారు.