
కోల్బెల్ట్, వెలుగు: మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఎసీపీ రవికుమార్ కోరారు. యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గురువారం మందమర్రి సర్కిల్ పోలీసులఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ, మందమర్రి సింగరేణి జీఎం దేవేందర్, సీఐ శశిధర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఏసీపీ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడొద్దన్నారు.
ఎవరైనా వినియోగించినా, రవాణా చేస్తున్నట్లు తెలిసినా సమాచారం ఇవ్వాలన్నారు. సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నుంచి మార్కెట్ మీదుగా కార్మికవాడల గుండా సాగిన ర్యాలీలో పోలీసులు, సింగరేణి ఆఫీసర్లు, రాజకీయ నేతలు, విద్యార్థులు, యువత, ఫ్లకార్డులతో పాల్గొన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’గా సంతకాలు చేశారు.
డ్రగ్స్నియంత్రణపై అవగాహన
నస్పూర్, వెలుగు: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐటీఐ కాలేజీ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదక ద్రవ్యాలను సమూలంగా అరికడితే మెరుగైన సమాజాన్ని చూడవచ్చన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు.
యువత మత్తుకు బానిసలు కావద్దు
లక్ష్మణచాంద, వెలుగు: డ్రగ్స్కు వ్యతిరేకంగా లక్ష్మణచాంద పోలీసుల ఆధ్వర్యంలో వడ్యాల్ లో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నుంచి ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సై జి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని కోరారు.