బిజినెస్ డెస్క్, వెలుగు: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారీగా పెరిగిన ఇన్ప్లేషన్, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక మాంద్యంలోకి గ్లోబల్ ఎకానమీ..ఇలా ఈ ఏడాది చాలా సమస్యలు మార్కెట్లను చుట్టుముట్టాయి. షేర్లలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది నష్టాలనే చూశారు. అయినప్పటికీ, లోకల్ మార్కెట్లు మిగిలిన దేశాల కంటే మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. 2022 ను 4.44 శాతం లాభంతో ముగించాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు ఈ ఏడాది కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. లార్జ్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు గత ఆరు నెలల్లో పుంజుకొని, ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చాయి. 2022 లో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.16.36 లక్షల కోట్లు పెరిగి రూ.282 లక్షల కోట్లకు చేరుకుంది. గ్లోబల్గా ఎలా ఉన్నా, ఎన్ని సమస్యలు ఎదురయినా లోకల్ మార్కెట్లు నిలకడగా కదిలాయని చెప్పాలి. జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలిగే లెవెల్లోనే ఉండడం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు, ప్రభుత్వ విధానాలు ఈ ఏడాది స్టాక్ మార్కెట్కు దన్నుగా నిలిచాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది టెక్, ఐటీ షేర్లు ఇన్వెస్టర్లను నిలువెల్లా ముంచేయగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు తామున్నామంటూ ఆదుకున్నాయి. ఐపీఓ మార్కెట్లో మెరుపులు కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఎల్ఐసీ ఐపీఓ కూడా ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచింది. మొత్తంగా 2022 ఈక్విటీ ఇన్వెస్టర్లకు తీపి జ్ఞాపకాల కంటే చేదు జ్ఞాపకాలనే ఎక్కువ మిగిల్చింది.
ఇలా సాగింది..
ఈ ఏడాది మొదటి ఆరు నెలలు స్టాక్ మార్కెట్లను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 24 న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. ఈ దెబ్బకు సెన్సెక్స్ 2,850 పాయింట్లు నష్టపోయింది. ఏకంగా 4.72 శాతం పతనమైంది. ఆ తర్వాతి నెలల్లో మరింత పడింది. గ్లోబల్గా పరిస్థితులు మెరుగవ్వడంతో ఈ నష్టాలను తగ్గించుకుంటూ వచ్చిన సెన్సెక్స్, ఈ నెల 1 న 63,583 వద్ద కొత్త ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ‘అనేక సమస్యలు ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెళ్లిపోయినా 2022 లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో డీఐఐలు మార్కెట్కు సపోర్ట్గా నిలిచారు. కొన్ని సెక్టార్లు మంచి పెర్ఫార్మెన్స్ చేసినా, మరికొన్ని భారీగా నష్టపోయాయి’ అని ఎనలిస్ట్ సుమన్ బెనర్జీ అన్నారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడంతో 2022 లో లోకల్ మార్కెట్ల పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉందని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా దేశ ఎకానమీపై గట్టి నమ్మకం ఉంచారని, సిప్ల ఫ్లోస్ ఈ ఏడాది రికార్డ్ లెవెల్కు చేరుకున్నాయని అన్నారు. ఇండియన్ మార్కెట్లు స్టేబుల్గా ఉండడంతో 2022 లోని చివరి ఆరు నెలల్లో ఎఫ్ఐఐలు తిరిగి మార్కెట్లోకి వచ్చారని వివరించారు.
అదరగొట్టిన అదానీ షేర్లు..
ఈ ఏడాది అదానీ గ్రూప్ షేర్లు అదరగొట్టాయి. ఇన్వెస్టర్లకు 2022 లో కూడా కళ్లు చెదిరే లాభాలిచ్చాయి. 10 అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో ఐదు ఈ ఏడాది 200 శాతం వరకు పెరిగాయి. ఈ కంపెనీలు మొత్తం కలిసి ఇన్వెస్టర్ల సంపదను రూ.8,54,915 కోట్లు పెంచాయి. ఈ ఏడాది అదానీ పవర్ 204 శాతం లాభపడింది. కిందటేడాది డిసెంబర్ 31 న ఈ కంపెనీ షేరు రూ.99.75 దగ్గర ట్రేడవ్వగా, ప్రస్తుతం రూ.303 కి పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2022 లో 122 శాతం లాభపడగా, అదానీ విల్మార్ ఇన్వెస్టర్లకు 118 శాతం రిటర్న్ ఇచ్చింది. అదానీ గ్రూప్ మెజార్టీ వాటా కొనుగోలు చేయడంతో ఎన్డీటీవీ షేర్లు ఈ ఏడాది 187 శాతం లాభపడ్డాయి. అలానే ఏసీసీ, అంబుజా సిమెంట్ను టేకోవర్ చేయడంతో ఈ కంపెనీల షేర్లు వరుసగా 11 శాతం, 37 శాతం పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు కూడా 2022 లో 11 శాతం నుంచి 48 శాతం వరకు ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇచ్చాయి.
నష్టంతో ముగింపు..
దేశ స్టాక్ మార్కెట్లు 2022 ను నష్టంతో ముగించాయి. ఈ ఏడాది చివరి ట్రేడింగ్ సెషన్ అయిన శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు లాస్లో క్లోజయ్యాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ హై లెవెల్స్ వద్ద సస్టయిన్ కాలేకపోయాయి. సెన్సెక్స్ 293 పాయింట్లు (0.48 శాతం) తగ్గి 60,841 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 18,105 వద్ద ముగిశాయి.