
ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్వామీజీ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీచర్ గా అవకాశం ఇస్తానని ఉద్యోగం పేరుతో ఆశ చూపి ఆశ్రమంలోనే తనకు నివాసం ఏర్పాటు చేశారని.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ వార్త ఇప్పుడు బెంగాల్ తో పాటు ఇండియా మొత్తం వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ కు చెందిన స్వామీజీ, ఇటీవలే పద్మశ్రీ అవార్డు పొందిన కార్తీక్ మహరాజ్.. 2013 లో తనపై 12 సార్లు అత్యాచారం చేశాడని మహిళ ఆరోపణలు చేసింది. తనకు టీచర్ జాబ్ ఇప్పిస్తానని చెబితే ముర్షీదాబాద్ లోని భారత్ సేవాశ్రమ్ సంఘా ఆశ్రమానికి వెళ్లానని.. ఆ స్వామీజీ తనపై జాలీ, కరుణ చూపిస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేశారని చెప్పింది.
అయితే ఒకరోజు రాత్రి స్వామీజీ తన రూమ్ కు వచ్చి బలవంతంగా అత్యాచారం చేశారని తెలిపింది. ఆ విధంగా 2013 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో 12 సార్లు రేప్ చేశారని చెప్పింది. ఇన్నాళ్లు భయంతో ఈ విషయం ఎక్కడా చెప్పకుండా తనలోనే దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ ఎవరికైనా చెప్పినా, పోలీసుల వద్దకు వెళ్లినా చంపేసీ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేస్తామని బెదిరించినట్లు చెప్పింది.
ఈ ఘటనపై మహిళ కంప్లైంట్ చేసినట్లు పోలీసులు కన్ఫామ్ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు జరగుతుందని తెలిపారు.
ఆరోపణలను ఖండించిన స్వామీజీ:
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పార్టీకి దగ్గరగా ఉండే పద్మశ్రీ కార్తీక్ మహారాజ్ స్వామీజీపై మహిళ ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై స్పందిస్తూ.. అవి నిరాధారమైన ఆరోపణలుగా స్వామీజీ ఖండించారు. తనపై కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను కార్తీక్ మహారాజ్ ఖండించారు. ‘‘నేను ఒక సన్యాసిని. సన్యాసి జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు రావడం సర్వసాధారణం. తమపై కావాలనే బురదజల్లాలని ప్రయత్నిస్తుంటారు’’. అని అన్నారు. తన లీగల్ టీమ్ దీనిపై స్పందిస్తుందని చెప్పారు.