శక్తి స్కీమ్ రద్దు చేయాలె.. కర్నాటక సర్కారుకు ప్రైవేట్ ఆపరేటర్ల డిమాండ్​

శక్తి స్కీమ్ రద్దు చేయాలె.. కర్నాటక సర్కారుకు ప్రైవేట్ ఆపరేటర్ల డిమాండ్​
  • ఉచిత రవాణాతో నష్టపోతున్నామని ఆవేదన
  • సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్.. రాష్ట్రంలో రోడ్డెక్కని 10 లక్షల వాహనాలు

బెంగళూరు: మహిళల ఫ్రీ ట్రాన్స్​పోర్ట్ కోసం తీసుకొచ్చిన ‘శక్తి స్కీమ్’​ను రద్దు చేయాలంటూ కర్నాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన బంద్.. సోమవారం అర్ధరాత్రి 12 గంటల దాకా కొనసాగింది. శక్తి స్కీమ్​ను ప్రైవేటు బస్సులకు అమలుచేయాలని అసోసియేషన్ లీడర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ:వరంగల్లో కొనసాగుతున్న బంద్.. కేయూ వద్ద బలగాల మోహరింపు

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శక్తి స్కీమ్ కారణంగా తమ వెహికల్స్​లో ఎవరూ ఎక్కడంలేదని, ఉపాధి దెబ్బతింటోందని అసోసియేషన్ తెలిపింది. తమ 30 డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా స్పందనలేదని తెలిపింది. అందుకే, 24 గంటల పాటు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చినట్లు వివరించింది. 32 ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ అసోసియేషన్లు ఈ బంద్​లో పాల్గొన్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా.. మరిన్ని బస్సులను రంగంలోకి దించింది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు బస్సుల సంఖ్య పెంచింది. మొత్తం 10 లక్షల ప్రైవేట్ వెహికల్స్ బంద్​లో పాల్గొన్నాయి. స్కూల్స్, కాలేజీలకు యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. 

27 డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధమన్న మంత్రి

ఫ్రీడమ్ పార్క్​లో అసోసియేషన్ లీడర్లతో రవాణ శాఖ మంత్రి రామలింగా రెడ్డి సోమవారం ఉదయం చర్చలు జరిపారు. వెంటనే బంద్ ను విరమించుకోవాలని వారికి సూచించారు. దీనిపై అసోసియేషన్ లీడర్లు మాట్లాడుతూ.. శక్తి స్కీమ్ పై ప్రభుత్వంతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు వివరించారు. అయినా న్యాయం జరగకపోవడంతో బంద్​కు పిలుపునిచ్చినట్లు వివరించారు. 

కొన్ని డిమాండ్లు నెరవేర్చలేం: సీఎం సిద్దూ

ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ యూనియన్ డిమాండ్లలో కొన్ని నెరవేర్చడం సాధ్యంకాదని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. శక్తి స్కీమ్​ను ఎత్తేయడం సాధ్యం కాదని,  సమ్మె జరిగితే బ్యాకప్ ప్లాన్​ రెడీగా ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.