హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ చెత్తాట కొనసాగుతోంది. సొంతగడ్డపైనా టైటాన్స్ నిరాశ పరిచింది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 26–42తో బెంగళూరు బుల్స్ చేతిలో చిత్తయింది. పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లతో మరోసారి ఒంటరి పోరాటం చేశాడు.
డిఫెండర్ మోహిత్ 4 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. బుల్స్ జట్టులో అక్షిత్ (9), సుర్జీత్ సింగ్ (7), వికాశ్ కండోలా (6) రాణించారు. ఈ మ్యాచ్కు వచ్చిన టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ స్టేడియంలో సందడి చేశారు. రెండో పోరులో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్ల్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబా, తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి.
