
Bengaluru Thief: మనిషి తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో పాటు జీవిత పోరాటంలో బతికేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంటాడు. అయితే ఆ క్రమంలో చాలా తక్కువ మంది మాత్రమే దొంగతనాలను వృత్తిగా ఎంచుకుంటుంటారు. అయితే తనతో పాటు తన పిల్లలను దొంగలుగా మార్చేందుకు ట్రైనింగ్ ఇస్తున్న ఒక దొంగ కథ అందరినీ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బెంగళూరులో నివసిస్తున్న బాబాజాన్ అనే వ్యక్తికి ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో ఇంటిని పోషించటానికి దొంగతనాలనే వృత్తిగా మార్చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో పాటు 9 మంది సంతానం కలిగిన 35 ఏళ్ల బాబాజాన్ ను బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సదరు దొంగ తన 16 ఏళ్ల కొడుక్కి కూడా దొంగతనాలు ఎలా చేయాలో ట్రేనింగ్ ఇచ్చి వరుస దొంగతనాల్లో పాల్గొనేలా చేసినట్లు తెలుసుకున్న పోలీసులు అవాక్ అయ్యారు.
బాబాజాన్ తాళాలు వేయని లేదా తెరచి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. ఇందులోనూ పక్కింటి వాళ్లతో ముచ్చుట్లు పెడుతూనో లేక టెర్రెస్ మీద ఏదైనా పనిలో ఉన్న మహిళలు ఉన్న ఇంటిని ఎంచుకుని తండ్రికొడుకులు దొంగతనాలు చేస్తారని పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల ఒక దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేడ్ ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. మే 7న వీరు 56 ఏళ్ల వృద్ధురాలు రాజమ్మ తన ఇంటిపై బట్టలు ఆరేసేందుకు వెళ్లిన సమయంలో వీరు రూ.4లక్షల 60వేలు విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో బంగారం, వెండి, నగదును కేవలం 20 నిమిషాల్లో దోచుకెళ్లాడు 16 ఏళ్ల బాలుడు. దీనికి తండ్రి సహాయకారిగా నిలిచాడని తేలింది.
గడచిన 8 ఏళ్లుగా బాబాజాన్ ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మైనర్ల పట్ట చట్టాలు కఠినంగా ఉండకపోవటంతో కొడుకును నేరాల్లో పాల్పడటానికి నిందితుడు ఉపయోగిస్తున్నట్లు తేలింది. నిందితుడి ముగ్గురు భార్యలు శ్రీరంగపట్నం, అనికల్, చిక్బళ్లాపూర్ ప్రాంతాల్లో ఉంటుండగా వీలైనప్పుడు వారి వద్దకు వెళుతుంటారు నిందితుడు బాబాజాన్. ప్రస్తుతం పోలీసులు నిందితుడి నుంచి 188 గ్రాములు గోల్డ్, 550 గ్రాములు వెండితో పాటు ఒక టూవీలర్ స్వాధీనం చేసుకున్నారు.