బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్ల  పరేషాన్..పై తరగతులకు అనుమతించమంటున్న యాజమాన్యాలు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్ల  పరేషాన్..పై తరగతులకు అనుమతించమంటున్న యాజమాన్యాలు
  • ఆందోళనలో 1,094 మంది విద్యార్థుల భవితవ్యం
  • వనపర్తి జిల్లాలో రూ.4.39 కోట్ల బకాయిలు
  • పెండింగ్​ బిల్లులు చెల్లించాలంటున్న స్కూల్​ యాజమాన్యాలు 

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని బెస్ట్​ అవైలబుల్​ స్కూల్​ స్కీం కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పై తరగతుల్లో ప్రవేశానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను లక్కీ డిప్​ ద్వారా ఎంపిక చేసి జిల్లాలోని వివిధ ప్రైవేట్​ స్కూళ్లకు కేటాయిస్తారు. ఇలా ఎంపిక చేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది.

అయితే మూడేండ్లుగా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన రూ.4.39 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో గతంలో ఎంపికైన 972 మంది ఎస్సీ విద్యార్థులు, 182 మంది ఎస్టీ విద్యార్థులను ఈ ఏడాది పై తరగతులకు అనుమతించబోమని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు న్యాయం చేయాలని పేరెంట్స్​ ఇటీవల డీఈవో, కలెక్టర్​ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఆందోళనలో 1,094 మంది స్టూడెంట్లు..

వనపర్తి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్​ కింద ఆరు స్కూళ్లు, ఎస్టీ కార్పొరేషన్  కింద రెండు బెస్ట్​ అవైలబుల్​ స్కూళ్లను ఎంపిక చేశారు. లక్కీ డిప్​ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కూళ్లకు కేటాయిస్తారు. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు నాలుగో తరగతి వరకు డే స్కాలర్​గా బోధిస్తారు. అందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.28 వేలు కేటాయిస్తుంది. 5 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు బోధనతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.42 వేల చొప్పున చెల్లిస్తుంది. ఎస్టీ కార్పొరేషన్​ మూడు, 10వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక చేస్తారు. ఒక్కో విద్యార్థికి రూ.42 వేల చొప్పున ప్రైవేట్​ స్కూళ్లకు ఫీజులు చెల్లిస్తారు.

ఇలా రెండు కార్పొరేషన్ల ద్వారా 2023–24, 2024–-25 విద్యా సంవత్సరాల్లో ఎంపికైన 1,094 మంది విద్యార్థులు ప్రస్తుతం పై తరగతుల్లో చేరాల్సి ఉంది. ఈక్రమంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు రూ.4,39,72,740 పెండింగ్​ ఉన్నాయని, వాటిని చెల్లిస్తేనే స్టూడెంట్లను చేర్చుకుంటామని చెబుతున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా 47 మంది ఒకటో తరగతికి, 49 మందిని 5వ తరగతికి లక్కీ డిప్​ ద్వారా ఎంపిక చేశారు. ఎస్టీ కార్పొరేషన్​ ద్వారా మరో 10 మందిని ఎంపిక చేశారు. వీరికి ఇప్పటి వరకు స్కూళ్లు కేటాయించలేదు.  

బిల్లులు చేసి పంపించాం..

బెస్ట్​ అవైలబుల్​ స్కూళ్లకు సంబంధించిన బిల్లులు చేసి ఈ కుబేర్​కు  పంపించాం. ఉన్నత స్థాయిలో వాటికి క్లియరెన్స్​ రావాల్సి ఉంది. బిల్లులతో ముడిపెట్టకుండా స్టూడెంట్లను హయ్యర్​ క్లాసెస్​కు అనుమతించేలా స్కూళ్ల యాజమాన్యాలతో మాట్లడుతున్నాం. స్టూడెంట్లకు అన్యాయం జరగనివ్వం. - మల్లికార్జున్, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ, వనపర్తి

ఆందోళనలో పేరెంట్స్..

1.094 మంది స్టూడెంట్లను పై తరగతులకు అనుమతించకుండా తిప్పి పంపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ప్రైవేట్​ స్కూళ్లలో విద్య అందకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.