
- ఉదయ్ ఓమ్నీలో అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీలతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని, త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్థోపెడిక్స్, ట్రామా కేర్ హాస్పిటల్ ఉదయ్ ఓమ్నీలో ఏర్పాటు చేసిన 'అత్యాధునిక మిస్సో రోబోటిక్ సిస్టమ్'ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ తెలంగాణకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలను తీసుకురావడంలో ముందంజలో ఉందన్నారు.
ఇక్కడ రోబోటిక్ సర్జరీ ప్రారంభించడం వల్ల ఎంతో మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థోపెడిక్ సంరక్షణ ప్రమాణాలు మరింత పెరుగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సర్జరీలు ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్నాయని, 2030 నాటికి మార్కెట్ 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా ఉందని మంత్రి వివరించారు.