భద్రాద్రి సీపీఐలో భారీ కుదుపు

భద్రాద్రి సీపీఐలో భారీ కుదుపు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీపీఐలో భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్​ లీడర్​ రావులపల్లి రాంప్రసాద్​, పార్టీ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్​లు బీఆర్​ఎస్​లో చేరారు. ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్​ఎస్​ అభ్యర్థి తెల్లం వెంకట్రావు హైకమాండ్​ ఆదేశాల మేరకు శుక్రవారం రావులపల్లి రాంప్రసాద్​ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ఆధ్వర్యంలో ఇరువురు కామ్రేడ్స్ నాలుగు కార్లలో హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.

అజయ్​కుమార్​కు రావులపల్లి రాంప్రసాద్​ స్వయాన మేనబావ. సీపీఐకి నియోజకవర్గంలో కీలకనేత. మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది. గులాబీ పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్​ వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న విధానాల్లో భాగంగానే రావులపల్లి రాంప్రసాద్​ను ఆహ్వానించారు. ఇది సీపీఐకి భారీ షాక్. అయితే ఆయన సోదరుడు రావులపల్లి రవికుమార్​ సీపీఐలోనే కొనసాగుతున్నారు.