
- వానాకాలం.. భద్రాద్రికి తప్పని వరద ముప్పు
భద్రాచలం, వెలుగు: భద్రాచలంను వరదల నుంచి రక్షించే కరకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయి. వానాకాలం వచ్చినా నేటికీ పనులు పూర్తి కాలేదు. ఈ ఏడాది కూడా భద్రాచలంకు వరద ముప్పు పొంచి ఉంది. రూ. 38 కోట్ల నిధులను కేటాయించినా పనుల్లో పురోగతి కన్పించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. భద్రాచలం టౌన్ శివారున కూనవరం రోడ్డులో విజయవాడ -జగదల్పూర్ జాతీయ రహదారిని దాటుతూ కరకట్ట వెళ్తుంది.
దీంతో ఇక్కడ ఫ్లైఓవర్ తరహాలో ఎలివేటర్ రోడ్డు నిర్మాణానికి మూడోసారి మళ్లీ సర్వే జరుగుతోంది. నీటిపారుదలశాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) విభాగం నుంచి నేటికీ డిజైన్లు రాలేదు. వీటికి అదనంగా రూ.40 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. డిజైన్స్ వస్తేనే పనులు మొదలవుతాయి.
కలవర పెడుతున్న వాతావరణ శాఖ హెచ్చరికలు
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు భద్రాద్రి వాసులను కలవరపెడుతున్నాయి. 2022 జులై నెలలో వచ్చిన వరదలకు భద్రాచలం వద్ద 22.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో 16 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 891 ఎకరాల్లో పంట నీటమునిగింది. దిగువన ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి మొదలయ్యాయి. కాపర్ డ్యాం కడితే బ్యాక్ వాటర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి సమయంలో భద్రాద్రికి కరకట్ట శ్రీరామరక్షగా ఉంటుందని పట్టణవాసులు భావించారు. శాంతినగర్, కూనవరం రోడ్డు, సుభాష్నగర్కాలనీ, కొత్తపేట వైపు వరద రాకుండా మిగిలిన అసంపూర్తి కరకట్ట పనులు 2024లో ప్రారంభించారు. కానీ కరకట్ట నిర్మాణం పనులు చూస్తే ప్రస్తుతం 700 మీటర్ల పొడవున నిర్మించాలి. జాతీయ రహదారికి ఒక వైపు మాత్రమే నిర్మాణం జరిగింది. రివిట్ మెంట్ పనులు చేస్తున్నారు. ఒక చోట స్లూయిజ్ నిర్మిస్తున్నారు. గేట్లు బిగించి, నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. హైవేకు మరో వైపు అసలు పనులే ప్రారంభం కాలేదు. కట్టిన చోట రివిట్మెంట్ పనులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
విసుగు పుట్టిస్తున్న సర్వేలు
జాతీయ రహదారి మీదుగా కూనవరం రోడ్డులోని కరకట్ట పనులు జరుగుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీస్ మాత్రం కరకట్ట మీదుగా హైవే వెళ్లాలంటే ఎలివేటర్(ఫ్లైఓవర్ తరహా) రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి డిజైన్స్ పంపిస్తే పర్మిషన్ ఇస్తామని చెప్పింది. ఇప్పటికే రెండు సార్లు ఈ ప్రాంతంలో నేల స్వభావం గురించి అధ్యయనం చేశారు. అనేక చోట్ల 14 బోర్వెల్స్ వేసి నేల లోతులో స్వభావంపై అంచనాలు వేసి నివేదికలు ఇచ్చారు.
కానీ తిరిగి మూడోసారి సర్వేను తాజాగా రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. సాత్విక్ ఇంజనీరింగ్ సంస్థ ముచ్చటగా మూడోసారి ఈ సర్వేను చేపట్టింది. వీరి నుంచి రిపోర్టులు వచ్చాక నీటిపారుదలశాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) డిజైన్స్ తయారు చేసి అప్రూవల్స్ వస్తేనే పనులు ప్రారంభమవుతాయి. దీంతో ఈ వానాకాలం పనులు పూర్తి అయ్యే పరిస్థితులు కన్పించడం లేదు.
జూన్ 15 నాటికి డిజైన్స్ పూర్తి: డీఈ
జూన్ 15 నాటికి సర్వే రిపోర్టులు ఆధారంగా డిజైన్స్ పూర్తవుతాయని నీటి పారుదలశాఖ డీఈ మధుసూధన్రావు తెలిపారు. అప్రూవల్స్ వచ్చాక పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం స్లూయిజ్ పనులు తుదిదశకు వచ్చాయన్నారు. పది రోజుల్లో గేట్లు బిగింపు,ఇతర పనులు అయిపోతాయన్నారు. నిర్మాణం పూర్తయిన కరకట్టకు రాయితో రివిట్మెంట్ చేస్తున్నాం. ఎలివేటర్ రోడ్డు నిర్మాణం పనుల కోసమే కరకట్ట పనులు ఆలస్యం అవుతున్నాయి.