- ఐటీడీఏ పీవో రాహుల్
అశ్వారావుపేట, వెలుగు: మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ డాక్టర్లకు సూచించారు. మంగళవారం మండలంలోని రెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలైన గిరిజన కుటుంబాల సౌకర్యార్థం ఈ మెగా క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపులను గిరిజనులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గిరిజనులకు పలు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మికంగా పాఠశాల తనిఖీ
మండలంలోని పాకల గూడెం, బండారి గుంపు జీపీఎస్ పాఠశాలను పీవో రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చేత బోర్డుపై అక్షరాలు, అధికారుల పేర్లు ఎలా రాయాలో వివరించారు. విద్యార్థులు సరిగ్గా రాయటం, చదవడంలో వెనుకబడి ఉన్నారని టీచర్లపై ఫైర్ అయ్యారు. ఉద్దీపకం వర్క్ బుక్ లోని సులభమైన పదాలు పిల్లలు చెప్పలేకపోతున్నారని అసహనం వ్యక్తి చేశారు. సంబంధిత ఎస్సీఆర్ పీవోల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కృష్ణ, రమేశ్, వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు.
