భద్రాచలం మండల బీఆర్​ఎస్​ప్రధాన కార్యదర్శి కేకే రాజీనామా

భద్రాచలం మండల బీఆర్​ఎస్​ప్రధాన కార్యదర్శి కేకే రాజీనామా

భద్రాచలం, వెలుగు  : భద్రాచలంలో గులాబీ పార్టీకి ఊహించని విధంగా షాక్​లు తగులుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం భద్రాచలం మండల బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి కొండి శెట్టి కృష్ణ మూర్తి అలియాస్​ కేకే రాజీనామా చేశారు. భద్రాచలంలోని కేకే ఫంక్షన్​ హాలులో తన కేడర్​​తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాతా మధు లోకల్ లీడర్లకు చెప్పకుండా పార్టీ మీటింగ్​లు పెడుతున్నారంటూ ఆరోపించారు.

ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు అభయాంజనేయస్వామి దేవస్థానం మాజీ ట్రస్టుబోర్డు చైర్మన్​ తాళ్ల రవికుమార్, సీనియర్​ నాయకులు చింతాడి రామకృష్ణ, పార్టీ మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు జాస్తి గంగాభారతి, మాజీ ఎంపీటీసీ జ్యోతి, మాజీ మహిళా అధ్యక్షురాలు కేతినేని లలిత, బూత్​ కమిటీ సభ్యులు, 100 కుటుంబాల సభ్యులు రాజీనామా చేసిన వారిలో  ఉన్నారు.