
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వీకెండ్, వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చారు. తెల్లవారుఝాము నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరారు. దీనితో క్యూలైన్లు కిటకిటలాడాయి. పడమర మెట్ల వైపు నుంచి క్యూలైన్లలో గాలిగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. దర్శనానికి గంట సమయం పట్టింది. ఉదయం సీతారామచంద్రస్వామికి గర్భగుడిలోమూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మంజీరాలు పంపిణీ చేశారు. అభిషేకం అనంతరం మూలవరులను అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు.
బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. 110కి పైగా జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ చేశారు. భక్తులు రామయ్య దర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం కూడా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ప్రసాదాల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.