భద్రాద్రికొత్తగూడెం/ ఆళ్లపల్లి, వెలుగు: జిల్లా అభివృద్ధిలో ప్రాజెక్టుల పురోగతి కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణపై పలు శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్లాన్ చేయాలన్నారు. అనంతరం ఆళ్లపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. ప్రీ ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
