భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి షురూ!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి షురూ!
  • ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై ఆఫీసర్ల దృష్టి
  • ఆ ఏడు పంచాయతీల్లోని ఎంపీటీసీల డిలీట్​పై రిలీజ్​ కాని జీవో

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి షురూ కావడంతో ఆఫీసర్లు బిజీ బిజీగా మారారు. అశ్వారావుపేట మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో వీలినం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లను జాబితాలోంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో చేసిన ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని, పోలింగ్​ఆఫీసర్లు, సిబ్బంది జాబితాలోని వారు ఎవరైనా ట్రాన్స్​ఫర్స్​పై  వెళ్లారా, వెళితే వారి స్థానంలో కొత్తవారిని తీసుకోని కొత్త జాబితాను సిద్ధం చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వాటిని సరిచేస్తున్నారు. 

పది పంచాయతీలు విలీనం..

జిల్లాలోని అశ్వారావుపేట మండలంలోని మూడు పంచాయతీలు కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. సుజాతనగర్​ మండలంలో ఏడు పంచాయతీలను  కొత్తగూడెం కార్పొరేషన్​లో కలుపుతూ ప్రభుత్వం జీవో రిలీజ్​ చేసింది. దీంతో ఈ పది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితాలతో పాటు పోలింగ్​ కేంద్రాలు, ఎంపీటీసీల మార్పులపై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. 

కాగా, గతంలో 220 ఎంపీటీసీలు ఉండగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఆరు ఎంపీటీసీలు విలీనం కావడంతో వాటిని తొలగించారు. ఇదే క్రమంలో కొత్తగా 22 ఎంపీటీసీలు ఏర్పడ్డాయి.  దీంతో మొత్తం 236 ఎంపీటీసీలు ఫైనల్​ అయ్యాయి.  కాగా, కొత్తగూడెం కార్పొరేషన్​లో సుజాతనగర్​ మండలంలోని ఏడు పంచాయతీలు విలీనం అయిన క్రమంలో ఆయా పంచాయతీల్లోని ఎంపీటీసీల డిలీషన్​కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో రిలీజ్​ కోసం జిల్లా పరిషత్​ ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పడిన భద్రాచలం జడ్పీటీసీతో కలిపి మొత్తం 22 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..
 
సర్పంచుల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడాదిన్నర దాటింది. జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి ఏడాది కావొస్తోంది. గతంలో రెండు, మూడుసార్లు ఎన్నికలంటూ ఆఫీసర్లు ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్​ ఆఫీసర్లు, సిబ్బంది జాబితా, బ్యాలెట్​ పేపర్లను సిద్ధం చేసుకున్నారు. కానీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్​ కూడా రావడం లేదు. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా ఆఫీసర్లు సన్నద్ధం చేస్తున్నారు. 

పంచాయతీరాజ్, జిల్లా ప్రజా పరిషత్​ ల వివరాలను ఆయా మండలాల స్థాయిలోనే ఆన్​లైన్​లో పొందుపర్చాలని ఎంపీడీవోలకు ఆదేశాలిచ్చారు. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్​ కేంద్రాలు, ఎంపీటీసీల పరిధిలో ఎన్ని పోలింగ్​ కేంద్రాలు, ఏ ఏ గ్రామాలు వస్తాయనే వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో తయారు చేసిన పోలింగ్​ ఆఫీసర్లు, సిబ్బందిలో ఎవరైనా ట్రాన్స్​ఫర్స్​, రిటైర్​ అయ్యారా, అయితే వారి స్థానంలో కొత్త వారిని తీసుకొని వాటిని ఆన్​లైన్​ పోర్టల్​లో నమోదు చేసేందుకు అవసరమైన వివరాలను సేకరిస్తున్నారు.