పరిశ్రమలతో జిల్లా అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ జితేశ్

పరిశ్రమలతో జిల్లా అభివృద్ధి సాధ్యం :  కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమవుతోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ అన్నారు. కలెక్టరేట్​లో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలు పెట్టుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా టీజీ ఐపాస్, టీ ఫ్రైడ్, సీఎం ఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, ముద్ర రుణాలతో పాటు డీఆర్డీఏ ద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తామన్నారు. 

జిల్లాలో ప్రతి ఒక్కరికీ సురక్ష బీమా, వయోజన, జీవన జ్యోతి బీమా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి ఇటుకల తయారీ చేయించాలన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఎవరికి ఏ రంగంలో శిక్షణ అవసరమో తెలుసుకొని ఆ రంగంలో ట్రైనింగ్​ ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగ పరిశ్రమలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

డిజిటల్​ఎంప్లాయిమెంట్​ ఎక్సేంజ్​ ఆఫ్​ తెలంగాణ యాప్ లో నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్​ సౌరబ్​శర్మ, అడిషనల్ కలెక్టర్​ విద్యాచందన, పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య, ఎల్డీఎం రామ్​రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, నగసాగు పెంపకంపై రైతులకు పలు సూచనలు చేస్తూ ఒక ప్రకనట విడుదల చేశారు. 

అతిసారం వ్యాధిపై అలర్ట్​గా ఉండాలి

అతిసారం వ్యాధిపై డాక్టర్లు, వైద్య సిబ్బంది అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​ జితేశ్​సూచించారు. కలెక్టరేట్​లో జరిగిన ఇంటర్​ సెక్టోరల్​ కో ఆర్డినేషన్​ టాస్క్​ ఫోర్స్​ సమావేశంలో ఆయన మాట్లాడారు. అతిసారంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్​వాడీ సెంటర్లలో ఓఆర్​ఎస్​ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం అతిసారంపై జాగ్రత్తలతో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 

నాణ్యతతో పనులు చేపట్టాలి

పాల్వంచ : పట్టణంలోని పాత పాల్వంచ చింతలచెరువు కట్టపై రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను నాణ్యతగా చేయాలని కలెక్టర్ జితేశ్​ అధికారులకు సూచించారు. పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ట్యాంక్ బండ్ నిర్మాణం చూపరులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అనంతరం కట్ట పటిష్టత  కోసం  వట్టివేర్ల మొక్కను నాటారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బానోత్ అర్జున్, డీఈ ఎం.రాణి, ఏఈ గురువేశ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే.సుజాత, పలువురు సిబ్బంది పాల్గొ న్నారు.

మురుగు సమస్యను పరిష్కరిస్తాం

లక్ష్మీదేవి పల్లి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానికంగా ఉన్న రిజర్వు ఫారెస్ట్ గుట్ట నుంచి వర్షాకాలంలో నీరు వచ్చి చేరుతున్నందున అక్కడ శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు. కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి ప్రిన్సిపల్ పద్మ తో పాటు సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు.