సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు మంగళవారం బయలుదేరగా తొమ్మిది రోజుల పాటు జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర సాగనుంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులందరికీ రామేశ్వరంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. ఈ యాత్రలో తిరువణ్ణామలై (అరుణాచలం) మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావురు లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.