
రాష్ట్రంలో సామాన్య జనాలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. అసెంబ్లీ హాల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. హాస్పిటల్స్ లో సరిగ్గా మందులు లేవని, స్టాఫ్ సరిపోయేటంత లేరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 108,104, రాజీవ్ ఆరోగ్యశ్రీ ని తీసుకువచ్చామని… ఇప్పుడు ఆ సర్వీసులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పడేసిందని చెప్పారు.
రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిని చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేలా ఉందని అన్నారు భట్టి. హాస్పిటల్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతున్నా.. కేసీఆర్ ప్రభుత్వం కనీస మరమ్మత్తులను కూడా చేయించలేదని చెప్పారు. కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్లలోనే ఒక్క గైనాకలజిస్ట్ కూడా లేరని… మధిర లో ఇద్దరు డాక్టర్ లు ఉండాలి… కానీ ఒక్కరు కూడా లేరని.. ఆపరేషన్ థియేటర్ కూలి పోయిందని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన నియోజక వర్గానికే పరిమితం అయ్యారని.. రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోలేదని చెప్పారు. ఫోన్ చేసినా స్పందించడంలేదని అన్నారు.
నీలోఫర్ పరిస్తితి మరీ ధారుణం…
కేసీఆర్ ప్రభుత్వంలో నీలోఫర్ హాస్పిటల్ పరిస్థితి మరీ ధారుణంగా తయారైందని అన్నారు భట్టి విక్రమార్క. శనివారం నీలోఫర్ హస్పిటల్ ను సంధర్శించిన ఆయన… రోజుకి 1000 మంది ఓపీ వచ్చే హాస్పిటల్ లో కనీస వసతులు లేవని చెప్పారు. ఒక్క బెడ్ కు ఆరుగురు పేషెంట్స్ ఉన్నారని తెలిపారు. ఆరు సవంత్సరాల క్రితమే… అప్పటి ఉమ్మడి ప్రభుత్వం.. కొత్త బిల్డింగ్ కట్టేందుకు పర్మిషన్ ఇచ్చినా ….ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం కట్టలేదని చెప్పారు. నీలోఫర్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లలో కనీసం ఏసీలు లేవని చెప్పారు భట్టి. కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి రాష్ట్ర పరిస్తితులను చూడాలని కోరారు.