హైదరాబాద్, వెలుగు: కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు వేతన సవరణతో పాటు పీఆర్పీ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతి, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రానున్న రోజుల్లో సింగరేణిని ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అంతకుముందు, సింగరేణి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణికి ‘తాడిచర్ల-2’ బ్లాక్ దక్కడంలో భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారంటూ ఆయనను అభినందించారు.
