వైఎస్ స్కీమ్​లను.. బీఆర్​ఎస్​ అటకెక్కించింది

వైఎస్ స్కీమ్​లను..  బీఆర్​ఎస్​ అటకెక్కించింది

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంట్​ ఫైల్​పై సంతకం చేసిన లీడర్​ వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ‘రైతులకు ఫ్రీ కరెంట్.. కాంగ్రెస్​ పార్టీకే పేటెంట్’​ అని అన్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​ పంజాగుట్ట సర్కిల్ లోని వైఎస్​ విగ్రహానికి, గాంధీభవన్, సీఎల్పీలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫ్రీ కరెంట్​గురించి మాట్లడే అర్హత ఇతర ఏ పార్టీకీ లేదన్నారు. 

పేదలు గుడిసెల్లో ఉండొద్దన్న ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం పేరిట ఇండ్లు కట్టించిన ఘనత వైఎస్​ సొంతమన్నారు. కానీ, బీఆర్​ఎస్ సర్కారు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లంటూ మాయమాటలు చెప్పి ఇందిరమ్మ ఇండ్లు లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్​ ప్రారంభించిన ఇందిర రాజీవ్​ సాగర్, ప్రాణహిత ప్రాజెక్టులను బీఆర్​ఎస్​ సర్కారు పూర్తి చేసుంటే 24 లక్షల ఎకరాలకు సాగునీరందేదన్నారు. మహిళల కోసం వైఎస్ తెచ్చిన పావలా వడ్డీ రుణ పథకాన్నీ బీఆర్​ఎస్​ సర్కార్​ అటకెక్కించిందన్నారు.

 ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్య శ్రీ వంటి గొప్ప పథకాలు పేదలకు ఉపయోగపడ్డాయన్నారు. ప్రతి తెలుగు వ్యక్తి వైఎస్​కు నివాళులర్పిస్తున్నారని, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందజేయాలన్న తపనే ఆయన్ను అందరూ అభిమానించేలా చేసిందని సీడబ్ల్యూసీ మెంబర్​ రఘువీరా రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ చీఫ్​ గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్ గౌడ్​ పాల్గొన్నారు.