జై హనుమాన్.. జై జై హనుమాన్.. జై భజరంగభళీ.. హనుమాన్ జయంతిన భక్తుల నామస్మరణతో మారుమోగింది. ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమాన్ జయంతి రోజున సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అది కూడా హైదరాబాద్ సిటీలోని BHELలోని రామాలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం. అవును.. హనుమాన్ మిమ్మల్ని చూస్తున్నాడు.. మీరు ఎటు వెళితే అటే చూస్తున్నాడు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమాన్ జయంతి రోజున BHEL సమీపంలోని ఓల్డ్ MIG కాలనీ ప్రాంతంలోని రామాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ విగ్రహం కంటి చూపే. భక్తులు ఎక్కడి నుంచి ఏ యాంగిల్లో చూసిన ఆ విగ్రహం మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తోంది. కుడివైపు నుంచి చూసిన, ఎడమ వైపు నుంచి వీక్షించిన, పై నుండి చూసిన ఆ విగ్రహం మనవైపు చూస్తున్నట్లు అనిపించడం విశేషం.
ఈ అద్భుతమైన దృశ్య దృగ్విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని దైవ శక్తి అంటుండగా.. ఇది కళకారులు, శిల్పకారులు అద్భుత సృష్టి అని ఇంకొందరు అంటున్నారు. అది దైవ శక్తి కాదని.. కేవలం దృశ్య భ్రమ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీడియో ఏఐ కాదు.. అలాగని దేవుడి శక్తి కూడా కాదు.. నిజానికి ఇది ఒక దృశ్య భ్రమ. శిల్పకారులు పెయింటింగ్లతో ఇలాంటి అద్భుతాలను సృష్టించగలరని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
మోనాలిసా ఎఫెక్ట్..!
ఒక శిల్పం లేదా విగ్రహంలో కళ్ళు సమతుల్యమైన లోతు, నీడలతో ముందుకు చూస్తున్నట్లుగా రూపొందించినప్పుడు ఇలాంటి అద్భుతమైన దృశ్య ప్రభావం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. వీక్షకుడు ఆ శిల్పంతో నేరుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. వీక్షకులు కదులుతున్నప్పుడు విగ్రహం చూపు తమ వైపు మళ్లుతున్నట్లుగా మెదడు గ్రహిస్తుంది. ఇది ఒక మానసిక దృశ్య భ్రమ. దీనిని కొన్నిసార్లు "మోనాలిసా ఎఫెక్ట్" అని కూడా పిలుస్తారంటున్నారు నిపుణులు.
శిల్పులు, చిత్రకారులు భక్తులకు దేవతలకు మధ్య అనుబంధ భావనను సృష్టించడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారంటున్నారు నిపుణులు. ఏదేమైనప్పటికీ హనుమాన్ జయంతి రోజున ఈ విగ్రహం మాత్రం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ వీడియో చూసి ఆంజనేయ స్వామి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. జై హనుమాన్.. జై జై హనుమాన్.. జై భజరంగభళీ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తు్న్నారు.
