న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) 2023-–24 ఆర్థిక సంవత్సరంలో జనవరి-–మార్చి క్వార్టర్కు (నాలుగో క్వార్టర్) రూ. 489.62 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 658.02 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 25.6 శాతం తగ్గుదల కనిపించింది. సంస్థ చేసిన ఖర్చులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సీక్వెన్షియల్గా సంస్థ నికర లాభం రూ.60.31 కోట్ల నుంచి ఏడు రెట్లు పెరిగింది.
కార్యకలాపాల ద్వారా రాబడి స్వల్పంగా 0.4 శాతం పెరిగి రూ.8,226.99 కోట్లకు చేరింది. ఆదాయం 50 శాతం పెరిగి రూ. 5,503.81 కోట్లకు ఎగిసింది. విద్యుత్, పారిశ్రామిక పరికరాలను తయారు చేసే భెల్ మొత్తం ఖర్చులు నాలుగో క్వార్టర్లో రూ. 7,411.64 కోట్ల నుంచి రూ. 7,794.11 కోట్లకు పెరిగాయి. అయితే ఖర్చులు గత క్వార్టర్లో రూ.5,537.47 కోట్లతో పోలిస్తే క్యూ4లో 40.75 శాతం పెరిగాయి.
దేశంలోని మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 53 శాతం వాటా బీహెచ్ఈఎల్కు ఉందని కంపెనీ ప్రకటించింది. భెల్కు 2024 ఆర్థిక సంవత్సరంలో లాభం భారీగా పడిపోయి రూ.282.22 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఏడాది రూ.654.12 కోట్లు వచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరం కోసం కంపెనీ బోర్డు రూ. 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 25 పైసల డివిడెండ్ను సిఫార్సు చేసింది.
