హైదరాబాద్, వెలుగు: భీమ్ యాప్ ద్వారా జరిగే నెలవారీ లావాదేవీల పరిమాణం కిందటేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య మూడు రెట్లు పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్కి చెందిన ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) ప్రకటించింది.
కిందటేడాది జూన్ నెలలో 7.96 కోట్లు (79.64 మిలియన్లు) గా నమోదైన లావాదేవీల సంఖ్య, ఈ ఏడాది మేలో ఏకంగా 24.4 కోట్లకు (244 మిలియన్లు) చేరాయి. కిందటి నెలలో ఈ ప్లాట్ఫారమ్ ద్వారా రూ. 26,952 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో భీమ్ యాప్ వాడకం మూడు రెట్లు పెరిగింది. మే 2026లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మర్చంట్ లావాదేవీలలో కస్టమర్లు రోజువారీ అవసరాలకే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేశారు. మొత్తం లావాదేవీలలో కిరాణా/గ్రోసరీస్ వాటా 23.9 శాతంగా ఉంది.
రెస్టారెంట్లు/ఫుడ్ ఔట్లెట్స్ వాటా 18.1 శాతంగా, క్విక్ కామర్స్ వాటా 11.6 శాతంగా నమోదైందని ఎన్బీఎస్ఎల్ సీఈఓ లలితా నటరాజన్ తెలిపారు. కొత్తగా లోన్లు, క్రెడిట్కార్డుల విభాగంలోకి వస్తున్నామని వెల్లడించారు.
