కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ 

కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ 

కరీంనగర్ : కరీంనగర్ పద్మనగర్ లో టీటీడీ  వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల సమక్షంలో ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ టెంపుల్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్ లో కేటాయించిన 10 ఎకరాల స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకన్న గుడి నిర్మిస్తున్నారు. బుధవారం (మే 31న) ఉదయం భూమిపూజ, సాయంత్రం కల్యాణోత్సం నిర్వహిస్తున్నారు. 

సాయంత్రం 4 గంటలకు మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి పద్మనగర్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయ నిర్మాణ స్థలంలో శ్రీనివాస్  కళ్యాణం నిర్వహించనున్నారు.

భూమి పూజ వేడుకల్లో పాల్గొనేందుకు తిరుమల నుంచి రెండు గజరాజులను (ఏనుగులు) కరీంనగర్ కు తీసుకువచ్చారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు.

వైవీ సుబ్బారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ

కరీంనగర్ కు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.