విద్యుత్ షాక్ తో రైతు మృతి.. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఘటన

విద్యుత్ షాక్ తో రైతు మృతి.. భూపాలపల్లి జిల్లా మల్హర్  మండలంలో ఘటన

మల్హర్, వెలుగు: విద్యుత్‌‌ షాక్‌‌తో భూపాలపల్లి జిల్లా మల్హర్  మండలానికి చెందిన రైతు చనిపోయాడు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన అప్పాల ఐలయ్య(50) తన పొలంలోని ట్రాన్స్‌‌ఫార్మర్  జంపర్  హ్యాండిల్  ఆన్  చేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్  షాక్  తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అప్పాల ఐలక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేశ్​ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్​ కిందపడి బాలిక..

పాలకుర్తి (దేవరుప్పుల): ఇసుక ట్రాక్టర్​ కింద పడి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామానికి చెందిన నక్కిరెడ్డి పూజ(15) చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. చిన్నమడూరు గ్రామంలోని హైస్కూల్​లో 8వ తరగతి చదువుతున్న పూజ శుక్రవారం ఉదయం స్కూల్​కు సైకిల్​పై బయలుదేరింది. సైకిల్​పై ఎత్తుగడ్డ ఎక్కుతుండగా, ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్​ ట్రాలీ తగలడంతో కింద పడిపోయింది. బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. ట్రాక్టర్  డ్రైవర్​ గుర్రం కుమార్​ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఊర సృజన్​ కుమార్​ 
తెలిపారు.