SIR ప్రక్రియకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. రాజ్యాంగానికి ఊపిరి పోస్తుందని వ్యాఖ్య

SIR ప్రక్రియకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. రాజ్యాంగానికి ఊపిరి పోస్తుందని వ్యాఖ్య

ఢిల్లీ: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పేరిట జరుగుతున్న SIR సర్వేకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. SIR ప్రక్రియ రాజ్యాంగానికి ఊపిరి పోస్తుందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కచ్చితమైన ఓటర్ల జాబితా దిశగా SIR ఒక ముందడుగు అని సుప్రీం కోర్టు తెలిపింది. SIR చుట్టూ ఏడాదిగా సాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు తీర్పుతో ముగింపు పలికినట్లయింది.

ఎన్నికల సంఘం SIR ప్రక్రియ అమలులో చట్టబద్ధమైన అధికారాలకు లోబడే వ్యవహరించిందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ వ్యాఖ్యతో ఎన్నికల సంఘం అధికారాలను అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. ఆర్టికల్ 324 ప్రకారం ECకి పూర్తి అధికారాలు ఉన్నాయని.. SIR విషయంలో ఎన్నికల సంఘం చర్యలు హేతుబద్ధమైనవేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్​’(సర్) లక్ష్యమని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. సర్లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, లింకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం పుట్టిన తేదీ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా జులై 1, 1987 కంటే ముందు భారతదేశంలో జన్మించిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తమ పుట్టిన తేదీ లేదా నివాస ధృవీకరణ కోసం ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపితే సరిపోతుంది.

అయితే, జులై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య కాలంలో జన్మించిన దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత పత్రాలతో పాటు, తల్లి లేదా తండ్రిలో ఒకరి వివరాలు లేదా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారైతే, తమ సొంత పత్రాలతో పాటు అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరి బర్త్ (జనన) లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ (పుట్టిన స్థలం) సర్టిఫికెట్లను కచ్చితంగా జతచేయాల్సి ఉంటుంది. 

ఈ వయస్సు ధ్రువీకరణ నమోదు ప్రక్రియ కోసం పాస్‌‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ సహా మొత్తం 12 రకాల పత్రాలను ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకోనుంది.