బండ్ల అమ్మకాలు బాగున్నయ్‌!

బండ్ల అమ్మకాలు బాగున్నయ్‌!
  •     రెండంకెల గ్రోత్‌ సాధించిన కంపెనీలు
  •     ఎగుమతులూ పెరిగినయ్‌..

న్యూఢిల్లీ: కన్జూమర్‌‌ సెంటిమెంట్స్‌‌ బాగుండటం, కరోనా ఎఫెక్ట్‌‌లు తొలగిపోయి మాక్రో ఎకానమీ మెరుగుపడటం వల్ల గత నెలలో వెహికల్స్‌‌ అమ్మకాలు దూసుకెళ్లాయి. చాలా కంపెనీలు సేల్స్‌‌లో రెండంకెల గ్రోత్‌‌ను సాధించాయి.  హోండా, నిస్సాన్‌‌, ఎంసీ మోటార్‌‌, స్కోడా వంటి కంపెనీల  సేల్స్‌ భారీగా పెరిగాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌‌ఐ) అమ్మకాలు కిందటి ఏడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 50 శాతం పెరిగి 1,62,462 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జూలైలో కంపెనీ 1,08,064 యూనిట్లను అమ్మింది. డొమెస్టిక్‌‌ మార్కెట్‌‌ అమ్మకాలు గత నెలలో 39 శాతం పెరిగి 1,41,238 యూనిట్లకు చేరుకున్నాయి. గత జూలైలో వీటి సంఖ్య 1,01,307 యూనిట్లు.

ఆల్టో, వేగన్‌‌ ఆర్‌‌ వంటి మినీ కార్ల అమ్మకాలు 17,258 యూనిట్ల నుంచి 19,685 యూనిట్లకు పెరిగాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో  డిజైర్ వంటి కాంపాక్ట్   కార్ల అమ్మకాలు 51,529 యూనిట్ల నుంచి 70,268 యూనిట్లకు పెరిగాయి.   ఎగుమతులు 21,224 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత సంవత్సరం జూలైలో 6,757 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. టాటా మోటార్స్‌‌ డొమెస్టిక్‌‌ మార్కెట్‌‌ అమ్మకాలు గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ సంవత్సరం జూలైలో  92 శాతం పెరిగి 51,981 యూనిట్లకు చేరాయి. 2020 జూలైలో కంపెనీ 27,024 యూనిట్లను అమ్మింది. కార్ల అమ్మకాల సంఖ్య 15,012 యూనిట్ల నుంచి 30,185 యూనిట్లకు పెరిగింది.  కమర్షియల్ వెహికల్స్అమ్మకాలు 12,012 యూనిట్ల నుంచి 21,796 యూనిట్లకు పెరిగాయి. 

హ్యుందాయ్ గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో  అమ్మకాలలో 46 శాతం పెరుగుదల సాధించింది. గత నెల 60,249 యూనిట్లను అమ్మగా, 2020 జూలై నెలలో కంపెనీ 41,300 యూనిట్లను అమ్మగలిగింది. డొమెస్టిక్‌‌ సేల్స్‌‌ 38,200 యూనిట్ల నుండి  48,042 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 3,100 యూనిట్ల నుంచి 12,207 యూనిట్లకు పెరిగాయి. ఎంజీ మోటార్ గత  నెలలో 4,225 యూనిట్లు అమ్మింది. ఏడాది ప్రాతిపాదికన చూస్తే రిటైల్ అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. 2020 జూలైలో కంపెనీ 2,105 యూనిట్లను అమ్మింది. ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ జెడ్‌‌ఎస్‌‌కు రికార్డుస్థాయి బుకింగ్స్‌‌ వచ్చాయని ఎంజీ మోటార్    ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ ట్వీట్​ చేశారు.