
రెండు నెలల గ్యాప్ తర్వాత ‘బింబిసార’ రూపంలో టాలీవుడ్కి హిట్ దక్కింది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న టీమ్ నిన్న ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదలుపెట్టిన ఐదో రోజునే ఫస్ట్ లాక్డౌన్. అది పూర్తయ్యి షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయగానే సెకెండ్ లాక్డౌన్. దాంతో చాలా నెర్వస్ అయ్యాను. ఎలాగోలా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్న టైమ్లో ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదన్నారంతా. దాంతో మళ్లీ టెన్షన్. అయితే మంచి కంటెంట్ తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే నమ్మకం నా మైండ్లో ఎప్పుడూ ఉంది. ట్రైలర్ మొదలు సినిమా విడుదల వరకు ప్రేక్షకులు, అభిమానులు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్స్. ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఆ రకంగా నాకు నటుడిగా పునర్జన్మనిచ్చిన సినిమా ‘బింబిసార’.
ఇకపై నేను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాను’ అన్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘గత రెండు నెలలుగా ప్రేక్షకులు థియేటర్స్కే రావట్లేదు. దీనిపై ఎలా వర్కవుట్ చేయాలా అని ఇండస్ట్రీ అంతా చర్చిస్తున్న సమయంలో విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు కొత్త ఊపిరిని పోసాయి. హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి పనిచేస్తే బడ్జెట్ అదుపులో ఉండడంతో పాటు సక్సెస్ కూడా సాధించొచ్చని మరోసారి ప్రూవ్ చేశారు. మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్కి బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావడం హ్యాపీ. నెల రోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది’ అని చెప్పారు. ఇంత గొప్ప విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు, నమ్మి అవకాశం ఇచ్చిన హీరోకి, నిర్మాతకి థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు వశిష్ట.