
- ఇంకా తగ్గుతుందన్న ఎనలిస్టులు
- ఈథరమ్ కాయిన్దీ ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ: బిట్కాయిన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రిప్టోకరెన్సీ శుక్రవారం ఒక నెల లోలెవెల్కు పడిపోయింది. ఇన్వెస్టర్లు లాంగ్ ర్యాలీ నుండి లాభాలను బుక్ చేసుకున్నారు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎంటీ గాక్స్ పేమెంట్ల గురించి భయాలు ఏర్పడటమే ఇందుకు కారణం. మార్కెట్ విలువ ప్రకారం బిట్కాయిన్ ఇప్పటికీ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. ఆసియాలో ఇది మిడ్-సెషన్లో 1.6 శాతం పడిపోయి 55,980 డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది అక్టోబర్ తరువాత ఇదే అత్యంత తక్కువ. గత వారం రికార్డుహై కంటే 20 శాతం తక్కువ. అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉండటం వల్ల కరెక్షన్ కనిపించిందని సింగపూర్ ఆధారిత క్రిప్టో అసెట్ మేనేజర్ స్టాక్ ఫండ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాథ్యూ డిబ్ చెప్పారు. టోకెన్కు దాదాపు 53,000 డాలర్ల వద్ద సపోర్టు అందేవరకు కరెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. బిట్కాయిన్ విలువ గత వారంలో 14 శాతం పడిపోయింది. అయితే 50 -రోజుల మూవింగ్ యావరేజ్ ద్వారా ఈ ఏడాది 90 శాతానికి పైగా లాభపడింది. బిట్కాయిన్లో అర బిలియన్ డాలర్లు కోల్పోవడంతో 2014లో ఎంటీ గాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. ఇన్వెస్టర్లకు డబ్బువాపసు ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఇది టోక్యో కోర్టులో సంతకం చేసింది. ‘‘ఈ నేపథ్యం వల్లే ప్రాఫిట్స్ బుకింగ్ పెరుగుతున్నది. అప్పుడు నష్టపోయిన వాళ్లు పెద్ద మొత్తంలో బిట్కాయిన్ను పరిహారంగా అందుకుంటారు. వచ్చే ఏడాది ఒకటో లేదా రెండో క్వార్టర్లో రీపేమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ భారీ నష్టం మార్కెట్లోకి కొంత భయాన్ని తెచ్చిపెట్టింది’’ అని డిబ్ చెప్పారు.
ఈథరమ్ కూడా..
మార్కెట్ విలువ ప్రకారం ఈథర్ రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. ఇది శుక్రవారం 4,014 డాలర్ల వద్ద మూడు వారాల కనిష్ట స్థాయికి సమీపంలో ఉంది. ఆరోజు 14 శాతం నష్టపోయింది. వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్ గురించి ఆందోళనలే ఈ పరిస్థితికి దారి తీశాయి. ఇటీవల గ్లోబల్ మార్కెట్లు అప్రమత్తంగా ఉండటంతో ఈథర్, బిట్కాయిన్.. రెండూ కూడా దెబ్బతిన్నాయి. అయితే బిట్కాయిన్ దీర్ఘకాలంలో ర్యాలీ చేస్తుందని ఓనాడా ఎనలిస్టు ఎడ్వర్డ్ మోయా అన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఫెడ్ రేట్లు పెరుగుతాయేమోనని చూస్తున్నారని, దీనివల్ల ఈథరమ్ మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. క్రిప్టోల్లో రిస్కు ఎక్కువ కాబట్టి రాబోయే రోజుల్లో అమ్మకాలు ఎక్కువగా ఉండొచ్చని వివరించారు.
క్రిప్టోలపైనా టాక్స్
క్రిప్టోకరెన్సీలపైనా టాక్స్ వసూలు చేయడానికి ప్రభుత్వం ఐటీ చట్టాల్లో మార్పులు తీసుకురానుంది. ఇందుకోసం రాబోయే బడ్జెట్ సమావేశంలో బిల్లులను ప్రవేశపెడుతుందని ఐటీశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇది వరకే కొందరు క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చిన ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ చెల్లించారని చెప్పారు. వీటికి జీఎస్టీ కూడా వర్తిస్తుందని అన్నారు.