
అధికార బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల(జూలై) వరుసగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 2023 జూలై 24న అన్ని జిల్లాల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ తరువాత 25న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టనుంది.
2023 ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. రేషన్ కార్డులు ఇవ్వాలని, రైతు రుణమాఫీ, ధరణి రద్దు చేయాలని ఆందోళనలు చేపట్టనుంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను సర్కార్ వెనక్కి తీసుకోవడంపై ఆందోళనలు చేయనుంది. అంతేకాకుండా దళిత వాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మొత్తం 100 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయించింది.