న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా( ఆర్పీఐ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు మరోసారి అవకాశం కల్పించింది. మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తవ్డేను కూడా నామినేట్ చేసింది. నాగ్పూర్ మాజీ మేయర్ మాయా చింతమన్ ఇవ్నాటే, మాజీ ఎమ్మెల్సీ రామరావు వాడ్కుటేను అభ్యర్థులుగా బరిలో నిలిపింది. మహారాష్ట్రలో ఏడు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ అవుతున్నాయి.
ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, రాందాస్ అథవాలే, ఫౌజియా ఖాన్ ఎన్సీపీ-(ఎస్పీ), రజనీ పాటిల్ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన యూబీటీ), బీజేపీ నేతలు ధనంజయ్ పాటిల్, భగవత్ కరద్ రాజ్యసభకు పదవీ విరమణ చేయనున్నారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులలో 230 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమికి ఉంది. ఈ బలంతో బీజేపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులు ఈజీగా విజయం సాధించే చాన్స్ ఉంది. గురువారం ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనుండగా మార్చి16న పోలింగ్ జరగనుంది.
