ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో బీజేపీకి చెందిన కౌన్సిలర్ కిషన్ నాయక్ గురువారం మురుగునీటి కాల్వలో నిలబడి కేక్ కట్ చేసి, వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రాలోని నాగ్లా ధాని, న్యూ విజయ్ నగర్ కాలనీలో చాలా కాలంగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇలా నిరసన తెలిపినట్లు కిషన్ నాయక్ పేర్కొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న డ్రెయిన్ను కొన్నేండ్లుగా సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో భారీగా పూడిక పేరుకుపోయిందని ఆయన ఆరోపించారు.
తాను ఈ విషయాన్ని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, సరైన చర్యలు తీసుకోలేదని నాయక్ అన్నారు. ఆరోగ్య శాఖ సహా వివిధ శాఖల అధికారులకు సుమారు 12 ఫిర్యాదులు సమర్పించినా పట్టించుకోలేదన్నారు. విసుగు చెందిన కౌన్సిలర్ తన అనుచరులు, స్థానికులతో కలిసి కాల్వ మధ్యలో టేబుల్ ఏర్పాటు చేసి, దానిపై కేక్ కట్ చేశారు. స్థానికులు కిషన్నాయక్కు పూలమాల వేసి, తలపాగా కట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
