బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త విజయ్ కుమార్

బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త విజయ్ కుమార్

శంషాబాద్ : శంషాబాద్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, పారిశ్రామికవేత్త వీటి విజయ్ కుమార్ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని విజయ్ కుమార్ భావిస్తున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ తులసీరామ్ చిన్న కుమారుడే విజయ్ కుమార్. తెలంగాణ తొలితరం ఉద్యమంలో పాల్గొన్న తులసీ రామ్..  పెద్దపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.

మొదటి దశ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ లోక్ సభకు.. తెలుగుదేశం పార్టీ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో తులసీరామ్.. చేవెళ్ల ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తులసీరామ్ పెద్ద కుమారుడు వీటి ప్రకాష్ రాజేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి చైర్మన్ గా పనిచేశారు.