లోకల్ బాడీ ఎన్నికలపై .. జూన్ 20న బీజేపీ కీలక సమావేశం

లోకల్ బాడీ ఎన్నికలపై .. జూన్ 20న  బీజేపీ కీలక సమావేశం
  • హాజరుకానున్న సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ 
  • పార్టీ అంతర్గత సమస్యలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చ

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. దీనిపై స్టేట్  ఆఫీసులో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనున్నది. బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్  ఈ భేటీకి హాజరుకానున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. 

ఈ భేటీలో పార్టీ అంతర్గత సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించనున్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక వర్క్‌‌‌‌షాప్  నిర్వహించనున్నారు. ఈ మీటింగ్​లో ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని చోట్లా పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ప్లాన్ చేస్తోంది. 

నేడు ఎల్బీస్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎల్బీ స్టేడియంలో 24 గంటల ముందు కౌంట్ డౌన్  మహోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి చీఫ్ గెస్టులుగా గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఇతర నేతలు, సంస్థల అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.