- హోం, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీల అభ్యంతరాలు
- భద్రతకు ముప్పేనంటున్న అధికారులు
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ బీవైడీ మన దేశంలో పెట్టాలనుకుంటున్న జాయింట్ వెంచర్ పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్తో కలిసి ఈవీలు, వాటి బ్యాటరీల తయారీకి తెలంగాణ రాష్ట్రంలో ఫెసిలిటీ పెడతామని బీవైడీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన విషయం తెలిసిందే. అయితే, దేశ భద్రత దృష్ట్యా బీవైడీ ఎంట్రీని ఆపాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీపై ఇండియా కంపెనీలకు కంట్రోల్ ఉండదని, దాంతో జాయింట్ వెంచర్లో అవి డమ్మీలుగా మాత్రమే ఉంటాయని ప్రభుత్వం భయపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాదాపు 8 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు, బ్యాటరీల తయారీకి ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను బీవైడీ వ్యక్తం చేసింది. చైనా కంపెనీలు దేశంలోకి రావడం పట్ల హోం, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినీస్ట్రీలు ..రెండూ అసౌకర్యంగా ఉన్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది.
జేవీలలో మన కంపెనీలు డమ్మీలే.....
చైనా కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న చాలా జాయింట్ వెంచర్ కంపెనీలలో కొన్ని ప్రభుత్వపరమైన సపోర్ట్ కూడా తీసుకున్నాయి. కానీ, ఈ జాయింట్ వెంచర్ కంపెనీల నిర్వహణ మొత్తం విదేశీ కంపెనీల చేతిలోనే ఉంటోంది. ఇండియా కంపెనీ పాత్ర నామమాత్రమవుతోందని, టెక్నాలజీ పరంగా అసలు కంట్రోలే మన కంపెనీలకు ఉండటం లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. బీవైడీ ప్రపోజల్ విషయంలో ప్రభుత్వానికి ఇలాంటి అభ్యంతరాలే ఉన్నాయని, ఇండియాలో దూసుకెళ్లాలనుకుంటున్న చైనా ఎలక్ట్రిక్ కంపెనీ ఎంట్రీపై అందుకే ఓకే చెప్పడానికి ఇబ్బందిపడుతోందని రిపోర్టు వివరించింది.
టెస్లాకు పోటీ ఇవ్వడమే బీవైడీ టార్గెట్...
తన బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటినీ ఇండియాలో తయారు చేయాలనే ఆలోచనతోనే మేఘ ఇంజినీరింగ్ గ్రూప్తో బీవైడీ చేతులు కలుపుతోందని రాయిటర్స్ ఇంతకు ముందు ఒక రిపోర్టు ప్రచురించింది. టెస్లాకు ధీటైన పోటీగా ఇండియా మార్కెట్లో నిలవాలనేది చైనా కంపెనీ బీవైడీ ఆలోచనగా పేర్కొంది. ఒకవేళ ఇండియాలో అనుమతి దొరికితే ఒక్క అమెరికా తప్ప అన్ని పెద్ద గ్లోబల్ మార్కెట్లలోనూ బీవైడీ ఎంటరయినట్లు అని రాయిటర్స్రిపోర్టు తెలిపింది.
ఎఫ్డీఐ రూల్స్ మార్చిన ప్రభుత్వం...
మన దేశంలో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలను కట్టడి చేసే ఉద్దేశంతో ఇంతకు ముందే ప్రభుత్వం రూల్స్ను మార్చింది. ముఖ్యంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నిబంధనలలో చాలా మార్పులు తెచ్చారు. మన దేశంలో కార్లు అమ్ముతున్న ఎంజీ మోటార్స్, గ్రేట్వాల్ మోటార్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీల ప్లాన్స్కు రూల్స్ మార్పు ద్వారా అడ్డుకట్ట వేశారు. కొత్త పెట్టుబడులు రాక ఎంజీ మోటార్స్ ఇటీవలి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో, ఇండియాలోనే పార్ట్నర్స్ను వెతుక్కునే పనిలో పడింది. ఇండియన్ పార్ట్నర్స్కు మెజారిటీ వాటా ఇవ్వడానికి సైతం ఈ కంపెనీ ఇప్పుడు ఆసక్తి కనబరుస్తోంది.