తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేసిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని.. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తున్నారన్నారు. మోడీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను బహిష్కరించే రోజు వస్తుందని విమర్శించారు.
వరంగల్ లో రైల్వే వ్యాగన్ పెడుతుంటే బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీ అయిన రైతుమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఉచిత ఎరువులు తదితర హామీలు అమలు చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయని.. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు దేశంలో భవిష్యత్తు లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎంను పెంచి పోషించాయన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కలిసి కట్టుగా పని చేసి కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాం హౌస్కి పంపిస్తామన్నారు.