- లాలు వ్యాఖ్యలకు కౌంటర్గా బీజేపీ క్యాంపెయిన్ ప్రారంభం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ‘మోదీ కా పరివార్’ పేరుతో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది. సోమవారం ట్విటర్ వేదికగా ఆ పార్టీ ఈ క్యాంపెయిన్ ను లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్ తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అని పెట్టుకున్నారు. కాగా, ఆదివారం బిహార్ లో నిర్వహించిన ‘జన్ విశ్వాస్’ ర్యాలీలో లాలు ప్రసాద్ మాట్లాడుతూ మోదీపై పలు విమర్శలు చేశారు.
మోదీకి సొంత కుటుంబం లేకుంటే మనం ఏం చేస్తాం? రామ మందిరం గురించి మోదీ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆయన నిజమైన హిందువు కాదు. హిందూ సంప్రదాయంలో తల్లిదండ్రులు మరణిస్తే.. కొడుకులు గుండు చేయించుకోవాలి. కానీ తన తల్లి మరణించినపుడు మోదీ అలా చేయలేదే?’’ అని లాలు వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్ పర్యటనలో పాల్గొన్న మోదీ.. లాలు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలను తాను ప్రశ్నిస్తుంటే తన ప్రత్యర్థులు తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు.