హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జ్యుడీషియల్ ఎంక్వైరీ అంటూ మాటమారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించకుండా కేవలం మేడిగడ్డకే విచారణను పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీబీఐ విచారణ కోరాలని, మింగిన సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణపై సీఎంతోపాటు మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.