వరదలతో జనం అల్లాడుతుంటే ఏం చేస్తున్నరు?

వరదలతో జనం అల్లాడుతుంటే ఏం చేస్తున్నరు?

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్- పరిధిలోని ప్రజలు వరదలతో  ఇబ్బంది పడుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు.  బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.  మంగళవారం నాలుగేళ్ల బాలుడు మిథున్ రెడ్డి మ్యాన్ హోల్ లో పడి మరణించాడని గుర్తుచేశారు. గతంలోనూ  ఇలాంటి విషాదకర ఘటనలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి  67 వేల కోట్లు ఖర్చు పెడితే వర్షం పడగానే పడవలు ఉపయోగించాల్సిన దుస్థితి ఎందుకు నెలకొందని నిలదీశారు. 

మ్యాన్ హోల్ మరణాలు, కుంగుతున్న నాలాలు, భవనాలు, కాలుతున్న కంపెనీలు, కొట్టుకుపోతున్న చెరువు కట్టలు, కుక్కల స్వైర విహారం వంటి ఘటనలు  హైదరాబాద్ పరిధిలో నిత్యకృత్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనలన్నింటికీ కేసీఆర్, -కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 9 ఏండ్లల్లో సిటీ పరిధిలో చేసిన సుందరీకరణ, పూడిక తీత, ఆనకట్టలు, పిల్లకాలువల తవ్వకం పనులను ఒక్కటైనా చూపగలరా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎంత త్వరగా తొలగిస్తే అంత మంచిదని ప్రభాకర్ పేర్కొన్నారు.