
మాటలు బారెడు పనులు మాత్రం మూరెడు అన్నట్లుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉంటుందన్నారు బీజేపీ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయని..ఎన్నికల హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి గుడిసెలు లేని వరంగల్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్ పేదలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని చెప్పారు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నారని, వరంగల్ ఒక్క చోటే కాదని, తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజానికమే కేసీఆర్ సర్కార్ను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వ్యాఖ్యానించారు.
తమకు ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టివ్వకపోగా..తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు..గరీబోళ్ల మీద పట్టబట్టినట్లు చేసుడేందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు..వీటిని రెవెన్యూ, పోలీస్ అధికారులు కూల్చేస్తున్నారు. కొన్నిచోట్ల అగ్గిపెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందామని పోరుబాట పడుతున్నారంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు విజయశాంతి.
కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు... చేసే పనులు మూరెడు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నరు. pic.twitter.com/48N4Q0Q3zE
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 16, 2022