కేసీఆర్​కు ఓట్ల మీదనే ప్రేమ : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్​కు ఓట్ల మీదనే ప్రేమ : వివేక్ వెంకటస్వామి
  • ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి

మునుగోడు, వెలుగు : తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మునుగోడు మండలంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శాలివాహన సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన వివేక్​ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని, ఆయనకు ఓట్ల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదన్నారు.

ఫామ్ హౌస్ కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాడని, కాళేశ్వరం అవినీతి సొమ్ముతో కేసీఆర్​కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. ప్రధాని మోడీ రోజూ దేశం కోసం ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పనిచేస్తుంటే..సీఎం కేసీఆర్​మాత్రం 100 కోట్లతో విమానం కొనుక్కొని తిరగాలని చూస్తున్నాడన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో సీఎం ఓట్లు కొందామని కలలు కంటున్నాడని, ప్రజలు మాత్రం తమ ఓట్లను అమ్ముకోవడానికి సిద్ధంగా లేరన్నారు. మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి, దుర్గా ప్రసాద్, వెంకన్న, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.